ప్రజలు ఛీకొట్టినా వారికి బుద్ధి రాలేదు

27 Nov, 2019 04:45 IST|Sakshi

చంద్రబాబు, పవన్‌పై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం 

సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలు ఛీకొట్టినా వారిద్దరికీ ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ జిల్లాకు ఆయన చేసిన మోసానికి ప్రజలు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా తిరస్కరించారని అన్నారు.

చంద్రబాబు తన పాలనలో ఎక్కడేం జరిగినా కడప రౌడీలు, పులివెందుల గూండాలు, పులివెందుల పంచాయితీ అంటూ రాయలసీమ వాసులను అవమానించేలా మాట్లాడారని, అందుకు అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ కూడా రాయలసీమవాసులను కించపర్చేలా మాట్లాడారని ఆరోపించారు.  కడపలో పదేళ్లుగా ఉక్కు ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌ ట్వీట్లన్నీ ఒకే ఆఫీసు నుంచి వస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. వారి వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.   

మరిన్ని వార్తలు