‘ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’

12 Nov, 2018 17:36 IST|Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ కడప జిల్లా : దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు అన్నారు. దేశంలో ఇంత మోసం చేసిన నాయకుడు ఎక్కడా లేడని విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఉక్కుపరిశ్రమకు ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు... కానీ పరిశ్రమ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ నాయకులు అభినందన సభ పెట్టడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లుగా నిద్రపోయి ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కహానీ ముందుకు తెచ్చారని శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అవసరం లేదని చంద్రబాబు గతంలో ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అనే నరకాసురుడు ప్రజలను పట్టి పీడిస్తున్నాడని, రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి, మభ్య పెట్టాలి అనే ఆలోచిస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు