‘సోనియా వల్లే మీ కుటుంబానికి పదవులు’

5 Jul, 2018 15:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం అన్నారు. ఉద్యోగాలు కల్పించకుండా, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ అనేది కేవలం మామా అల్లుళ్ల డ్రామా అని.. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే ప్రస్తుతం తెలంగాణలో నీళ్లు పారుతున్నాయన్నారు.

సోనియా గాంధీ దయ వల్లే నీ తండ్రి, చెల్లి, బావమరిది, తమ్ముడు పదవులు అనుభవిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని, ఆమె గురించి మాట్లాడేపుడు జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావును కాంతం హెచ్చరించారు. అప్పటి డిప్యూటీ సీఎం దామెదర రాజనర్సింహ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సోనియా గాంధీకి వివరించి తెలంగాణ తెచ్చారని కాంతం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యమకారులను తగిన విధంగా గౌరవించుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు