సిద్ధు, డీకేల వల్లే ఎమ్మెల్యేల మధ్య గొడవలు

24 Jan, 2019 08:23 IST|Sakshi

మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ధ్వజం 

సాక్షి, బెంగళూరు : బళ్ళారికి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా మారడంతో పాటు హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేష్‌ మధ్య జరిగిన గొడవకు మూల కారణం మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే.శివకుమారలేనని మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వద్ద ప్రాబల్యం చూపించుకుంటూ వీరిద్దరు ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని విమర్శించారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ను గాలి జనార్ధన్‌ రెడ్డి బుధవారం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే శివకుమార్‌ మధ్య కోల్డ్‌వార్‌ మొదలైందని అన్నారు. ఎమ్మెల్యే గణేష్, భీమానాయక్‌లు సిద్ధరామయ్య వర్గంలో ఉన్నారని, మిగతావారు మంత్రి డీకే బృందంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల్లో గుంపు రాజకీయాలు మొదలయ్యాయని విమర్శించారు.

ఆనంద్‌సింగ్‌పైన దాడి విషయంలో మంత్రి డి.కే. శివకుమార్‌ మొత్తం అబద్దాలు చెబుతున్నారని, దాడి జరిగిన రోజు సాయంత్రం డిశ్చార్జి అవుతారని ఆయన అంటే, మరో మంత్రి జమీర్‌ ఆహ్మద్‌ ఆనంద్‌సింగ్‌కు బిర్యాని తెప్పించి తినిపిస్తానని అన్నారన్నారు. కానీ అక్కడ ఆస్పత్రిలో ఆనంద్‌సింగ్‌ పరిస్థితి చుస్తుంటే మరికొన్ని రోజుల వరకు డిశ్చార్జి అయ్యేలా కనిపించడ లేదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో బెడ్‌పైన పడుకుని ఉన్న తన ఆత్మీయ స్నేహితుడు ఆనంద్‌సింగ్‌ను ఆ పరిస్థితిలో చూస్తే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదని అన్నారు. కన్నుతో పాటు తలకు తీవ్రమైనగాయమైందని అన్నారు. దాడి చేసిన గణేశ్‌ కూడా ఒక ఎమ్మెల్యేనే అని, ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

ఆ రోజు నన్ను చూడనివ్వలేదు: ఎమ్మెల్యే రాజుగౌడ  
రిసార్టులో ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ పైన జరిగిన దాడి చూస్తుంటె ఇది సాధారణ మనుషులు చెసినట్లులేదని, కరుడుకట్టిన రాక్షసులు దాడి చేసినట్లు ఉందని ఎమ్మెల్యే రాజుగౌడ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆనంద్‌సింగ్‌ను పరామర్శించారు. దాడి జరిగిన రోజునే ఆస్పత్రికి వస్తే,  కొంతమంది పని కట్టుకుని ఎవరినీ లోనికి వెళ్ళకుండా చేశారని, అందుకు కారణం ఇప్పుడు ఆనంద్‌సింగ్‌ ఉన్న పరిస్థితిని చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. ఆనంద్‌సింగ్‌ ముఖం చూడగానే చాలా భయం వేసిందన్నారు. శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. అధికార కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ ఇవ్వలేక పోతున్నారు, ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.ఇంత జరిగినా పొలీసులు ఎమ్మెల్యే గణేష్‌ను పట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు