సాక్షి, నంద్యాల: అధికార పార్టీకి చెందిన నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ రెచ్చిపోయారు. సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విజయ్ కుమార్ చాలా దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనమ్మపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెను ఏకవచనంతో సంభోదిస్తూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సమావేశం జరుగుతున్న సమయంలో పదే పదే అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ వితండ వాదనకు దిగారు.
విజయ్ కుమార్ ప్రవర్తనతో సభ సజావుగా సాగకపోవడంతో సులోచనమ్మ సభను వాయిదా వేశారు. అనంతరం బయటకు వెళ్తున్న సులోచనమ్మపై సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తారని విజయ్ కుమార్ గట్టిగా కేకలు వేశారు. అడ్డు చెప్పిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్పై ఆయన తన చేతిలో మైకును విసిరివేశారు.