సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ

25 Oct, 2019 11:59 IST|Sakshi

సాక్షి, గుంటూరు : కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే వంశీ టీడీపీ వీడతారనే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్ధరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు ఎమ్మెల్యే వంశీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  అంతేకాకుండా ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డిని కూడా వంశీ కలిశారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో  సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు

ఇక సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలతో పాటు, పార్టీ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీమంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.  మరోవైపు వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


 

మరిన్ని వార్తలు