టీడీపీ నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?

15 Nov, 2019 15:40 IST|Sakshi

నేను ముందే రాజీనామా చేశా: వల్లభనేని వంశీ

చంద్రబాబుకు వయసు మీదపడి మతి భ్రమించింది

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు సంక్షేమం అందుతుంది 

సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?. నేను ముందే పార్టీకి రాజీనామా చేశా. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు. కాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అయితే సస్పెన్షన్‌ కంటే ముందే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.

చదవండి: సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మాట్లాడుతూ...’నాపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసు. నా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రానా నా ఇమేజ్‌ ఏమీ తగ్గదు. ఎన్నికల సమయాల్లో సూట్‌కేసులు కొట్టేసేవాళ్లు నా పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. నేను ఏమి అనుకున్నానో అది మనస్పూర్తిగా చేస్తాను. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. మనసాక్షిగానే వ్యవహరిస్తున్నాను. ప్రభుత్వం మంచి పనులు చేస్తే పార్టీలకు అతీతంగా మద్దతు చెప్పాం. ఇక మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. 

అలాగే నాపై విమర్శలు చేసేవాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవాళ్లు కాదు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుడ్డు ఎలా పెట్టాలనేది? నేనేమైనా పప్పా? నాకు ఏమీ తెలియదా? నేను చదువుకున్నాను. పనికిమాలినవాడిని కాదు కదా?. నేను వాస్తవం అనుకున్నదే చెప్పాను. నా వెనుక ఉండి ఎవరూ నడిపించడం లేదు.  చంద్రబాబు నాయుడువి మతి చెలించిన మాటలు.  ఆయనకు రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయాలని దీక్ష చేయాలి. నల్లబట్టలతో నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు వ్యతిరేకంగా దీక్ష చేయగలరా?’ అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు.

చదవండి‘ఇసుకపై చంద్రబాబు దీక్షలు సిగ్గుచేటు’

>
మరిన్ని వార్తలు