మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి

23 May, 2018 14:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్ట జాతకుడని, ఆయన అధర్మ పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాలన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. దాన్ని గంగాజలంతో శుద్ధి చేసే కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విశాఖ సీపీ యోగానంద్‌ ఎయిర్‌పోర్టు రన్‌పైనే వైఎస్‌ జగన్‌ను అడ్డుకున్న ఘటనపై పార్లమెంటు సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాంటి యోగానంద్‌ కులపిచ్చితో పోలీసులను తెలుగుదేశం కార్యకర్తల్లా వాడుకుంటున్నారని అన్నారు.

విశాఖపట్టణంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట సభ అధర్మ సభ, అన్యాయమైన సభ అని వ్యాఖ్యానించారు. స్వలాభం, స్వార్ధం, ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ సభలను విశ్వవిద్యాలయంలో నిర్వహించరాదన్న జీవో ఉన్నప్పటికీ అనుమతి ఇచ్చి వీసీ, రిజిస్ట్రార్‌ నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు.

చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి అని అందరికీ తెలుసని అ‍న్నారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కి, పార్టీ మీద, కార్యకర్తల మీద, సానుభూతిపరులైన సోషల్‌మీడియాలో పని చేసే వ్యక్తులపైనా దొంగ కేసులు పెట్టడం వంటి ప్రజావ్యతిరేక చర్యలతో రాబోయే ఎన్నికల్లో అధికారం సిద్ధించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు