మేనిఫెస్టో అంశాలపై ఏఐపీసీ కసరత్తు: గీతారెడ్డి

2 Oct, 2018 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలపై తాము కూడా కసరత్తు చేస్తున్నామని ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ (ఏఐపీసీ) దక్షిణ భారత కోఆర్డినేటర్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ ప్రతిపాదించిన 5 అంశాలను అక్కడి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చారని వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో గీతారెడ్డి ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్, రోహిత్, కల్యాణ్‌ నార్ల తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ నేతృత్వంలోని ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా 5 వేల మంది సభ్యులుగా ఉన్నారని, తెలంగాణలో కూడా 450 మంది సభ్యత్వం తీసుకున్నారని ఆమె వివరించారు. ఏఐపీసీ నిర్వహిస్తోన్న మంతన్‌ సంవాద్‌ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగే ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’అనే సెమినార్‌లో పాల్గొనేందుకు శశిథరూర్‌ వస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు