ఢిల్లీ ఎన్నికలు : గెట్‌ రెడీ : ప్రశాంత్‌ కిషోర్‌

6 Jan, 2020 17:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలతో సహా విశ్లేషకుల దృష్టి హస్తిన వైపు మళ్లింది. ఎన్నికలపై చర్చలకు దిగితూ.. రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఫిబ్రవరి 8న పోలింగ్‌, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్పందించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. ‘ప్రజల బలం చూసేందుకు ఫిబ్రవరి 11న సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆయన ఎన్నికల సలహాదారుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆప్‌ విజయానికి దోహదపడేందుకు ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌ బృందం గ్రౌండ్‌ వర్క్‌ను ప్రారంభించింది. ప్రచారం, పథకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాల్లో కేజ్రీవాల్‌కు సలహానిస్తోంది. (మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా)

కాగా షెడ్యూల్‌ విడుదల అనంతరం సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఢిల్లీలోని ప్రతి గడపగడపకు తమ ప్రచారాన్ని చేరవేస్తామని అన్నారు. విద్య వైద్యం ఆరోగ్యం వంటి అంశాల్లో గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన స్థితికి చేర్చామని పేర్కొన్నారు. రెండోసారీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కేజ్రీవాల్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?)

  

మరిన్ని వార్తలు