నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్‌

5 Nov, 2019 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వైఫల్యం మీద దేశంలో 650 కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాము. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది. 2014లో అధికారంలోకి రాగానే 10కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్య రెట్టింపు అయ్యింది. ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారు. నల్లధనం బయటకు తెచ్చి ప్రతి పేదవారికి 15 లక్షల రూపాయల వారి అకౌంట్స్ లో వేస్తామని చెప్పింది. బీజేపీ ప్రభుత్వంలో 25 వేల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. దీని ద్వారా రూ. 3లక్షల కోట్లు దుర్వినియోగం అయ్యింది. కశ్మీర్‌కి వెళ్లాలంటే సుప్రీంకోర్టు అనుమతితో వెలసిన దుస్థితి నెలకొంది.

జమ్మూలో పరిస్థితుల అధ్యయనం కోసం వెళ్తే అక్కడ 5 గంటలు వెయిట్ చేయించి ఢిల్లీకి సీపీఎం నేతలతో పాటూ బలవంతంగా నన్ను వెనక్కి పంపారు. కశ్మీర్‌కి ఆ రాష్ట్ర నేతలను, ప్రజాప్రతినిధులు, మీడియాను వెళ్లేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా రక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదానికే పరిమితమైందని, ఆచరణలో మాత్రం అందనంత ఎత్తులో ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంత పెరిగిందని ఆజాద్ అన్నారు. ఉద్యోగ కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు పసిగడతారని ఆజాద్ పేర్కొన్నారు. బాబ్రీ మజీద్, భోఫోర్స్‌ అంశం బీజేపీకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తాయి. వాళ్లు ముందుగా ఎన్నికల్లో నిరుద్యోగులకు, దేశ ప్రజలకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని అన్నారు. 

మరిన్ని వార్తలు