సాక్షి, అమరావతి: డ్యామ్షూర్ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది.. అధికార పార్టీ టీడీపీ గూటికి చేరిన తర్వాత పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్న వ్యాఖ్యలివి. జగనన్న అంటే తనకు ప్రాణమని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనన్నే అని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఆమె.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేరీతిలో వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్సీపీని వీడుతున్నందుకు బాధపడుతున్నానని ఆమె చెప్పారు. ఆత్మాభిమానం చంపుకొని టీడీపీలో చేరుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే గెలుస్తుందని ఆమె చెప్పారు. గతంలో బాక్సైట్ విషయంలో తల నరుకుతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో విశాఖ జిల్లా రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్బాబు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె వెంట ఉన్న నేతలు అవాక్కయ్యారు.