సాక్షి, పట్నా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఓపక్క ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లారని సెటైర్ వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
'కాంగ్రెస్ పార్టీ ఎక్కడా విజయం సాధించదని రాహుల్గాంధీకి ముందే తెలుసు. రాజకీయాలంటే అసలు రాహుల్కు సీరియస్నెస్ లేదు. ఇలాంటి కీలకమైన సమయంలో ఒక పార్టీ చీఫ్ ఎవరైనా పార్టీని, కార్యకర్తలను, నాయకులను ఇలా ఒంటరిగా వదిలేసి వెళతారా. ఇలాంటి సమయంలో కనీసం కార్యకర్త కూడా ఎక్కడికీ వెళ్లడు. పార్టీ అధ్యక్షుడిగా అసలు రాహుల్ గాంధీకి ఏమాత్రం ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు' అంటూ ఆయన తీవ్రంగా విమర్శిచారు. హోలీ సందర్భంగా తాను తన అమ్మమ్మ (93) దగ్గరకు ఆశ్యర్యంలో ముంచెత్తేందుకు వెళుతున్నట్లు రాహుల్గాంధీ తన ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిరిరాజ్ సింగ్ విమర్శలు చేశారు.