క్షేమంగా ఇంటికి వెళ్లిన సీఎం..

22 Feb, 2018 14:35 IST|Sakshi
గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నలీలావతి ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి పంపించారు. దీంతో ఆయన అక్కడ నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గోవా డిప్యూటీ స్పీకర్‌ మైఖెల్‌ లాబో స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి ప్యాంక్రియాటిస్‌ సమస్య కారణంగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అయితే, పారికర్‌ చనిపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుకోవడానికి ఏముందంటూ పెట్టి కలకలం రేపారు.

ఈ వార్తలతో అసలు పారికర్‌కు ఏమైందంటూ పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అయితే, అవన్నీ కూడా ఊహాగానాలే అని పారికర్‌ డిశ్చార్జి కావడంతో స్పష్టమైంది. 'పారికర్‌ గోవా చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి విడుదల కావడం మంచి శుభవార్త. అయితే, ఆయన ఎప్పుడు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారనే విషయం ఇప్పుడే తెలియదు' అని మైఖెల్‌ చెప్పారు. పారికర్‌కు ఉన్న పట్టుదల సామర్థ్యమే ఆయనను కోలుకునేలా చేసిందని, ఆయనే బడ్జెట్‌ బిల్లు ప్రవేశ పెట్టాలని అనుకుంటే కచ్చితంగా త్వరలోనే పెడతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారికర్‌ పనాజీలోని తన నివాసానికి వెళ్లారు.

మరిన్ని వార్తలు