‘వైఎస్సార్‌ కుటుంబాన్ని నమ్మినవారికి అండగా ఉంటాం’

23 Nov, 2018 10:46 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్‌లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్‌ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సమక్షంలో ఓబులేసు, భాస్కర్‌రెడ్డి, నీలకంఠ అనుచర వర్గం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు ఇంచార్జ్‌ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓబులేసుతో సహా పలువురు నేతలు తమ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. తమను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ప్రజలు అంత చూశారని అన్నారు. వైఎస్సార్‌ కుటుంబాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఏం జరిగిన మంత్రి ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరాలని అన్నారు.

గత కొద్ది రోజులుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా నేతలు గొరిగెనూరుకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్‌ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వైఎస్సార్‌ సీపీ నేతల రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తుల అంక్షలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.

మరిన్ని వార్తలు