‘గవర్నర్‌ ఆ చేతిని ఫినాయిల్‌తో కడగాల్సింది’

20 Apr, 2018 11:28 IST|Sakshi
బీజేపీ నాయకుడు శేఖర్‌ వెంకటరామన్‌

సాక్షి, హైదరాబాద్‌ : తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ మహిళా జర్నలిస్టు చెంపను తడమటాన్ని సమర్ధిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు శేఖర్‌ వెంకటరామన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. జర్నలిస్టును తాకిన చేయిని బన్వరీలాల్‌ ఫినాయిలతో కడుక్కోవాలని సూచించారు.

వెంకటరామన్‌ పోస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్ట నివారణా చర్యల్లో భాగంగా ఆయన దాన్ని తొలగించారు. గవర్నర్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీల పరువుకు భంగం కలిగించేందుకే జర్నలిస్టు గవర్నర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారని వెంకటరామన్‌ పోస్టులో రాసుకొచ్చారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు బడా వ్యక్తులతో గడపకుండా రిపోర్టులు కాలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్లలో వస్తున్న ఫిర్యాదులను గమనిస్తే ఇదే ప్రస్ఫుటమవుతుందని వ్యాఖ్యానించారు.

సెక్స్‌ ఫర్‌ డిగ్రీ స్కామ్‌లో పురోహిత్‌ పేరు బయటకు రావడంపై లక్ష్మీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వని గవర్నర్‌ ఆమె చెంపను తడిమారు. దీనిపై మాట్లాడిన వెంకటరామన్‌ విశ్వవిద్యాలయాల్లో కన్నా మీడియా సంస్థల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అనుచితంగా ప్రవర్తించి, చెంపను తాకినందుకు మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రహ్మణ్యంకు గవర్నర్‌ క్షమాపణ తెలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు