నాకేం సంబంధం: మంత్రి బొత్స ప్రశ్న

29 Aug, 2019 20:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్దే తమ అభిమతమని, ఎవర్నీ నిర్లక్ష్యం చేయబోమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికో, వ్యక్తులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, అన్ని జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు.

సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, జరగాల్సిన వాటిపై మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులు 40 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సీఎంకు వివరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. టెండర్ల దశలో ఉన్న పనులను రద్దు చేస్తున్నామన్నారు. ఆయా పనులకు నిధులు ఎలా వస్తాయి అనేది లేకుండానే టెండర్లు పిలిచారని వెల్లడించారు.

చంద్రబాబు బంధువు రామారావు స్థలాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చిన విషయాన్ని ఆయన జీవో ఆధారంతో సహా చూపించారు. 2012లో చేర్చినట్లు చెప్పడం అబద్దమేనని బొత్స అన్నారు. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి భూములు గురించి తాము చెప్పిన లెక్కలు వాస్తవమేనని అన్నారు. రాజధాని పరిధిలో ముంపు వ్యవహారంపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన విలేకరులకు స్పష్టం చేశారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. (ఇది చదవండి: నారా లోకేశ్‌ తోడల్లుడి అబద్ధాలు)

మరిన్ని వార్తలు