లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో పోలీసుల అమానుష చర్యలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ప్రియాంకా గాంధీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ ఆర్ దారాపురీ కుటుంబాన్ని పరామర్శించేందుకు లక్నో వెళ్లగా..పోలీసులు తనను కదలడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు తనపై భౌతిక దాడి చేశారని, ఒకరు గొంతు పట్టుకోగా, మరొకరు మెడపట్టి తోసేశారని మండిపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో తాను కింద పడిపోయానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు ఈ ప్రదేశంలో కర్ప్యూ ఉందని అవాస్తవాలు చెబుతున్నారని, తాను ప్రవేశించే వరకు ఇక్కడ కర్ప్యూ విధించలేదని పోలీసులపై ప్రియాంక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను మార్కెట్కు లేదా ఏ ప్రదేశానికైనా వెళ్తానని..దారాపురీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదనే మీడియాకు సమాచారం ఇవ్వలేదని ప్రియాంకా తెలిపారు. కాగా, ప్రియాంక ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము చెయ్యి చేసుకున్నట్లు చెప్పడం అబద్ధం. ఆమె ముందుకు వెళ్లకుండా మేం అడ్డకున్నామన్న ఆరోపణలు అవాస్తమని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అర్చనా సింగ్ తెలిపారు. ప్రియాంక గాంధీ తన రాజకీయాల కోసం ఓ మహిళా పోలీసు అధికారిని విమర్శిస్తున్నారని యూపీ ప్రభుత్వ ప్రతినిధి శలాబ్ మణి త్రిపాఠి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.