అంబానీ కోసమే...

8 Jan, 2019 03:38 IST|Sakshi

హెచ్‌ఏఎల్‌ను బలహీనపరుస్తున్నారు: రాహుల్‌

న్యూఢిల్లీ: రఫేల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరింత స్వరం పెంచారు. సోమవారం పార్లమెంట్‌ వెలువల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లుగా రూ.లక్ష కోట్ల కాంట్రాక్టులో హెచ్‌ఏఎల్‌కు ఒక్క ఆర్డర్‌ కానీ, ఒక్క రూపాయి కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. ఆమె రక్షణ మంత్రిగా కాదు, మోదీకి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేందుకే ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను బలహీన పరుస్తోందని ఆరోపించారు. ‘ఎంతో అనుభవం, ప్రతిభావంతులైన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఉన్న హెచ్‌ఏఎల్‌కు రూ.15,700 కోట్లను చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బకొట్టిన విషయంలో సమాధానం చెప్పేందుకు చౌకీదార్‌ (ప్రధాని మోదీ) సభలో ఉండరు. సభకు రావడానికి ఆయన భయపడుతున్నారు’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు