సీఎల్పీ నేత హోదాలో గాంధీభవన్కు ఒకే వాహనంలో వెళ్లిన ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాబు, గండ్ర
అక్కడి నుంచి పార్టీ తరఫున లేఖ తీసుకుని మళ్లీ అసెంబ్లీకి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ఎంపికయిన మల్లు భట్టివిక్రమార్కను టీపీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సీఎల్పీ నేత హోదాలో తొలిసారి గాంధీభవన్కు వెళ్లిన ఆయనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లుకిషన్ తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టిలకు గజమాల వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకే వాహనంలో ఆ నలుగురు..
అంతకుముందు జరిగిన అసెంబ్లీ సమావేశానికి కాంగ్రెస్ సభ్యులంతా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడిన తర్వాత, ఉత్తమ్కుమార్రెడ్డి గాంధీభవన్కు బయలుదేరారు. తనతోపా టు రావాలని భట్టిని కోరడంతో భట్టి, శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలు ఉత్తమ్ వాహనంలోనే గాంధీభవన్కు వెళ్లారు. అక్కడి నుంచి సీఎల్పీ నేతగా భట్టిని నియమిస్తూ పార్టీ పక్షాన ఇచ్చి న లేఖను తీసుకుని మళ్లీ గాంధీభవన్కు వచ్చారు. అప్పుడు ఉత్తమ్ గాంధీభవన్లోనే ఉండిపోయారు. భట్టితో పాటు శ్రీధర్బాబు, గండ్రలు మళ్లీ అసెంబ్లీకి వచ్చి, పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ చాం బర్కు వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి భట్టిని సీఎల్పీ నేతగా నియమిస్తూ ఇచ్చి న లేఖను అందజేశారు. సీఎల్పీ నేతగా భట్టిని గుర్తి స్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ లేఖలో కోరారు. స్పీకర్ను కలిసిన వారిలో శ్రీధర్బాబు, గండ్రతోపాటు మాజీ మంత్రి షబ్బీర్అలీ, సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పొడెం వీరయ్య ఉన్నారు.
భట్టిని అభినందించిన కేటీఆర్
సీఎల్పీ నేతగా ఎంపికైన భట్టివిక్రమార్కకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు భట్టి, కేటీఆర్లు యాదృచ్ఛికంగా కలిశారు. టీఆర్ఎస్ఎల్పీ, సీఎల్పీ కార్యాలయాలున్న భవనం ముందు భట్టికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో కేటీఆర్ కూడా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం నుంచి అసెంబ్లీ సమావేశ మందిరానికి వెళుతున్నారు. ఆ సమయంలో ఎదురుపడిన భట్టిని కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. ఆయన్ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలియజేశారు. ప్రతిపక్ష నేతగా బాగా పనిచేయాలని కోరారు. వాస్తవానికి, పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలపాల్సి ఉన్నా యాదృచ్ఛికంగా మీరు కలవడంతో ఇవ్వలేకపోతున్నానని భట్టితో అన్నారు. భట్టి కూడా కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.