సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నమ్మితే ఉరి వేసుకున్నట్లే అని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు నిరసన.. హత్య చేసిన వ్యక్తి శాంతి యాత్ర చేసినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ.. కేంద్రం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ నుంచి వ్యతిరేకత, నిరసన తెలుపుతోందని అన్నారు. గతంలో మోదీని అసెంబ్లీలో పొగిడిన చంద్రబాబు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఆనాడే నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలిపారని చెప్పారు. ఏపీకి బడ్జెట్లో ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
కాపులను బీసీలలోకి మారుస్తామని చెప్పి టీడీపీ ఓట్లు వేయించుకుందని గుర్తుచేశారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మంజునాథన్ కమిటీని పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాపులను బీసీలలో చేరుస్తున్నామని చెప్పి.. కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పత్రికలలో వార్తలు తప్ప.. పని జరగదన్నారు. పసుపు, కుంకుమ పథకంపై లోకేశ్ అప్పు కాదు ఉచితం అని చెబుతున్నారు.. ఎక్కడైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఫిబ్రవరి చివరలో నోటిఫికేషన్ వస్తే మార్చిలో చెక్కులు ఎలా ఇస్తారని, చెక్కులు చూసుకోవడానికే తప్ప డ్రా చేసుకోవడానికి కాదన్నారు. టీడీపీ పాలనకు ఇంకా 75 రోజులే మిగిలి ఉందని, టీడీపీ వెంటిలేటర్పై ఉందని ఎద్దేవా చేశారు.