గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

5 Jun, 2020 05:08 IST|Sakshi

రాజ్యసభ ఎన్నికల ముందు ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

మొత్తం ఏడుకు చేరిన పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు

అహ్మదాబాద్‌: రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. గుజరాత్‌ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆక్షయ్‌ పటేల్, జితు చౌధరి బుధవారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. వీరిద్దరితో పాటు మార్చి  నుంచి గుజరాత్‌లో మొత్తం ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగానే.. మార్చిలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం 66 మంది సభ్యులున్నారు. జూన్‌ 19న ఎన్నికలు జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు బీజేపీ సిటింగ్‌ స్థానాలే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది.

ఎంపీల పీఏలకు ప్రవేశం లేదు
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బందిని అనుమతించకూడదని లోక్‌సభ సచివాలయం గురువారం నిర్ణయించింది.సమావేశాలు జరుగుతున్న సమయంలో సుమారు 800 మంది ఎంపీల పీఏలను ప్రాంగణంలోకి అనుమతిస్తే కరోనా సమస్య మరింత జటిలమవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు