‘గల్లా జయదేవ్‌ మాట తప్పారు’

21 Mar, 2019 20:55 IST|Sakshi
షౌకత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ గల్లా జయదేవ్‌ తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పారని గుంటూరు ఈస్ట్‌ టీడీపీ నాయకుడు షేక్‌ షౌకత్‌ ఆరోపించారు. గురువారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశానని వెల్లడించారు. గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పిస్తానని గల్లా జయదేవ్‌ మీడియా ముఖంగా చెప్పారని తెలిపారు. మద్దాల గిరి, గల్లా అరుణ కూడా తనకు హామీయిచ్చారని చెప్పారు.  వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడికి రాయపాటి సాంబశివరావు రెండు రోజుల్లోనే టిక్కెట్‌ ఇప్పించారని, తనకు మాత్రం మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు మాట ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. గుంటూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు, మైనార్టీలను ఒక తాటిపై తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రచారం సాగిస్తానని షౌకత్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు