'టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ.. టీడీపీ విషప్రచారం'

17 Jan, 2019 10:31 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగానే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. 

వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని గుత్తా తెలిపారు.

మరిన్ని వార్తలు