భయంతోనే రాహుల్‌ అక్కడ పోటీ : జీవీఎల్‌

31 Mar, 2019 13:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, చంద్రబాబుపై బీజేపీ ఎంపీ బీవీఎల్‌ నరసింహారావు విమర్శలు గుప్పించారు. బాబు, రాహుల్‌ గాంధీకి ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. బీజేపీపై దుష్ప్రచారం తమకు పాజిటివ్‌గా మారుతోందని చెప్పారు. కాంగ్రెస్‌కు అమేధీలో వ్యతిరేత ఉండడంతో రాహుల్‌కు భయపట్టుకుందని, అందుకే కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ సభలో రాహుల్‌ దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 44 స్థానాలు కూడా ఈసారి రావని జోస్యం చెప్పారు. చంద్రబాబు, రాహుల్‌, మమత, కేజ్రీవాల్‌ వ్యక్తిగత ప్రతిష్ట కోల్పోయారని అన్నారు. బహిరంగ చర్చకు రావాలని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ చంద్రబాబుకి సవాల్‌ విసిరితే.. ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. 

‘ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మళ్లీ తెలుగుదేశం పార్టీ నిలబడలేదు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణ్‌గా మారాడు. పెదబాబు, చినబాబులను పల్లెత్తు మాట అనడం లేదు. మంగళగిరి వైపు కన్నెత్తి చూడటం లేదు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా పవన్ నటిస్తున్నారు ’ అని చెప్పారు. గంటల తరబడి సోది ముచ్చట్లు చెబుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం  చేశారో మాత్రం చెప్పడం లేదని అన్నారు. కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న సీఎం  స్టిక్కర్ బాబుగా మిగిలిపోయారని చురకలంటించారు. 12 లక్షల ఆవాజ్ యోజన ఇళ్ళు ఇస్తే.. అవన్నీ తామే ఇచ్చామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.  స్పెషల్ ప్యాకేజీ కింద 90 శాతం కేంద్రం నిధులిస్తే.. అవినీతికి  పాల్పడ్డారు . ఏపీకి ఇచ్చిన నిధుల గురించి ప్రధాని మోదీ చెబుతుంటే సహించలేక పోతున్నారు. కేంద్రం మాట్లాడి కియా ప్రాజెక్టును దేశానికి తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు