సిద్దిపేట దళితుల ఆశీర్వాద సభలో హరీశ్రావు
సిద్దిపేటజోన్: బీఫామ్ తీసుకున్న వెంటనే అమ్మానాన్నలు, మీ ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన దళితుల ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మీకు మరింత సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. సిద్దిపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని చెప్పారు.
దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో ఎస్సీ స్టడీ సర్కిల్, రెండు ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు డప్పుకొట్టి అందర్నీ అలరించారు. ఈ సభకు భారీ ఎత్తున దళితులు హాజరయ్యారు.