కాంగ్రెస్, బీజేపీలను పాతర పెట్టాలి

1 Apr, 2019 03:41 IST|Sakshi

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్‌రావు

మనోహరాబాద్‌/శివ్వంపేట/దుబ్బాకటౌన్‌: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను పాతరపెట్టాల్సిన రోజులు దగ్గరకొచ్చాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో రోడ్‌ షో, శివ్వంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో, రాత్రి దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రాహుల్‌గాంధీ ఆదివారం విజయవాడ సభలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం సంతోషమేనని.. అయితే తెలంగాణలోని పరిశ్రమ రంగాలకు రాయితీ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నంబర్‌ వన్‌ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. రోడ్‌ షోలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితోపాటు ఆయా సమావేశాల్లో రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఏపీకి కాబోయే సీఎం జగన్‌... 
దేశంలోనే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధించిన ఎంపీల పేర్లు చదువుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభ చరిత్రలో 4వ రికార్డు మెజార్టీ సాధించారంటూ ప్రత్యేకంగా హరీశ్‌ ప్రస్తావించారు.  

మరిన్ని వార్తలు