‘సంగారెడ్డి’పై స్పెషల్‌ నజర్‌ 

10 Jan, 2020 02:48 IST|Sakshi

అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై మంత్రి హరీశ్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఆశిస్తూ ఆయన భార్య నిర్మల కౌన్సిలర్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో సంగారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీశ్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, జైపాల్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

బ్రేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు, ప్రచారం, సమన్వయానికి సంబంధించి సూచనలు చేశారు. రెబల్స్‌ బుజ్జగింపు, ఆశావహులకు సర్దిచెప్పడంపై దృష్టి కేంద్రీకరిం చాలని ఆదేశించారు. పార్టీ సర్వే, ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ఇతర నివేదికల ఆధారంగా మున్సిపాలిటీ పరిధిలో 80 శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, గురువారం రాత్రిలోగా జాబితా విడుదల చేయాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు