మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే..

4 Jan, 2020 01:24 IST|Sakshi

మంత్రి తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాకటౌన్‌: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడో నూకలు చెల్లిపోయాయని.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో జరిగిన పల్లె ప్రగతి సభల్లో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే, వాటిని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ కోర్టుకు పోయిందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అన్నారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌.. టీఆర్‌ఎస్‌ అంటే కేసీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికే కాంగ్రెస్, బీజేపీలు జంకుతున్నాయని, చాలా చోట్ల ఆ పార్టీలకు అభ్యర్థులు దొరకరని అన్నారు.

మరిన్ని వార్తలు