టీడీపీ- కాంగ్రెస్‌ల పొత్తా?.. సిగ్గుచేటు!

26 Nov, 2018 16:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటైన కాంగ్రెస్-టీడీపీలపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అడగడుగునా అవమాన పరిచి, వివక్షకు గురిచేసిన టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. దళితులను రాజధాని ప్రాంతం నుంచి వెళ్లగొట్టడానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న దోపిడిపై కోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో సోమవారం పర్యటించిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులు సాగుచేస్తున్న అసైన్డ్‌ భూముల్ని ఏపీ మంత్రులు బెదిరించి, అక్రమంగా కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్‌ భూముల రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని.. అంతేకాకుండా పట్టా భూముల రైతులకు ఇచ్చే ప్యాకేజీలు కూడా వారికి వర్తింపచేసేలా చూడాలని డిమాండ్‌ చేశారు. పదిహేను రోజుల్లో అసైన్డ్‌ భూముల రైతులకు న్యాయం జరగకపోతే అమరావతిలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.

ఏపీ రాజధాని అంతర్జాతీయ ఆర్థిక నేరం
చంద్రబాబు ఏపీని సింగపూర్‌ కంపెనీలకు అమ్మేశారని హర్షకుమార్‌ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా అమ్మడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట జరుగుతున్న దోపిడిపై ప్రధానికి పిర్యాదు చేస్తానని తెలిపారు. సీఎం బినామీలు, పార్టీ నాయకుల కోసమనే విధంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను కబ్జాలు చేసి, టీడీపీ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాలుపడుతోందని ధ్వజమెత్తారు.   

మరిన్ని వార్తలు