హరియాణా సీఎం ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై స్పందిస్తూ ‘గతంలో బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునేవారమని, ఇకపై కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చు’అంటూ వ్యాఖ్యానించారు. ఫతేబాద్లో శనివారం లింగ నిష్పత్తిపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు వివాదం కావడంతో, మీడియా తనను అపార్థం చేసుకుందంటూ తను అన్న మాటలను వీడియో ఆధారాలతో ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, హరియాణా ముఖ్యమంత్రివి హేయమైన మాటలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. కఠోరమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ కూడా ఆ బలహీన మనస్తత్వం ఉన్న మనిషిపై ప్రభావితం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా అవమానంగా భావించాలి’అని అన్నారు.