ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

29 Dec, 2017 17:57 IST|Sakshi

సాక్షి, ముంబయి : బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ముంబయి అగ్ని ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి కారణం జనాభా అన్నారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయిలోని కమలామిల్స్‌ కాంపౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 14మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.

దీనిపై మీడియా ప్రతినిధులతో హేమమాలిని పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ 'పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదు. వారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు