తమిళనాడు బీజేపీకి అధిష్టానం నోటీసులు

28 May, 2019 08:14 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర నిర్వాహకులపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటమి వైఫల్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా సోమవారం ఆదేశించింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సహా పలు పార్టీలతో కూటమిగా ఏర్పడిన బీజేపీ ఐదు స్థానాల్లో పోటీ చేసింది. అయితే అన్ని స్థానాల్లోనూ భారీ ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయింది.

మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో 1999లో తమిళనాడులో బీజేపీకి 7.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటివరకు అంతకు మించి ఓట్లను సాధించలేకపోయింది. 2009లో 2.3 శాతం, 2014లో 5.60 శాతం పొందింది. తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం 3.7 శాతానికి పడిపోయింది. (చదవండి: తమిళి సైకు పదవీ గండం)

మరిన్ని వార్తలు