సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్కు హైకోర్టులో ఊరట లభించింది. దిగ్విజయ్కు నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్బెయిల్బుల్ వారెంట్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు దిగ్విజయ్ సింగ్కు నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ దిగ్విజయ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది.
ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో ప్రచారం నిర్వహించిన దిగ్విజయ్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోడానికే ఎంఐఎం పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అసదుద్దిన్ బరిలోకి దింపాడంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దమారం రేపాయి. ఈ వ్యాఖ్యల వల్ల తమ పార్టీకి, అధినేత పరువుకు భంగం కలిగిందంటూ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా దిగ్విజయ్ హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా అతడు విచారణకు హాజరు కానందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు వెలువరించింది.