సనత్‌నగర్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా..

19 Nov, 2018 11:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నామినేషన్లకు సోమవారం చివరిరోజు కావడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జోరుగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌, మహాకూటమి, బీజేపీ సహా పలు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు  చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21, 22 తేదిలలో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. డిసెంబర్‌ 7 ఎన్నికలు నిర్వహించి.. 11వ తేదిన ఫలితాలను ప్రకటిస్తారు.

సనత్‌నగర్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా..

  • సనత్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిమంది టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చిన తలసాని నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనత్‌నగర్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
     
  • రంగారెడ్డి జిల్లా: షాదనగర్‌లో మహాకూటమి ( కాంగ్రెస్ ) అభ్యర్థిగా చౌలపల్లి ప్రతాపరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా అనుషారెడ్డి, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
  • వికారాబాద్ జిల్లా: తాండూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి,  స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ తిరుగుబాటు నేత నారాయణరావు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసి వస్తూ పరస్పరం ఎదురుపడటంతో ఆల్ ది బెస్ట్ చెప్పుకున్న మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి..
  • నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందురు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నామినేషన్‌.. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని ఆర్వో కార్యాలయంలో కాంగ్రెస్‌ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ దాఖలుచేశారు.
     

సిరిసిల్లలో కేటీఆర్‌ నామినేషన్‌

  • తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు సిరిసిల్లలో నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్దగా హడావిడి లేకుండా ఆయన ఒక్కరే వెళ్లి రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావుకు నామపత్రాలు సమర్పించారు.

భట్టి నామినేషన్‌

  • తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్స్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో మధిర తహసీల్దార్ కార్యాలయంలో భట్టి విక్రమార్క తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. భట్టి మొత్తం మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

కోడంగల్‌లో ఉద్రిక్తత..

  • నామినేషన్ల చివరి రోజైన సోమవారం కోడంగల్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కోడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి నామినేషన్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఎలాగైనా ర్యాలీని నిర్వహించి తీరుతామని రేవంత్‌ వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే కోడంగల్‌లో భారీగా పోలీసులు మెహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను విధించారు. 

తలసాని సెంటిమెంట్‌..

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సనత్‌నగర్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థిగా ఈ రోజు తన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌ వేసే మారేడుపల్లిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి తల్లి లలితాబాయి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి నామినేషన్ సమయంలో తల్లి ఆశీర్వచనాలు తీసుకోవడం తలసాని సెంటిమెంట్. ఆ తర్వాత మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్‌ వేయనున్నారు.
     
  • తెలంగాణ కాంగ్రెస్ ప్రచార క‌మిటీ చైర్మన్‌ భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఈ రోజు 11.30 గంట‌ల‌కు మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. భట్టి నామినేష‌న్ కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే అరుణ‌, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి త‌దిత‌రులు ప్రత్యేకంగా హాజ‌రుకానున్నారు.
     
  • ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం కాంగ్రెస్‌ అభ్యర్థి పోదెం. వీరయ్య నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
  • మహా కూటమి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ)  సత్తుపల్లిలో  నామినేషన్ దాఖలు చేయనున్నారు.
  • సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు మహేంద్రహిల్స్ నివాసం నుంచి భారీ ర్యాలీగా తరలి వచ్చి, మధ్యాహ్నం12 నుంచి 1 గంట మధ్యన సికింద్రాబాద్ లో బోర్డ్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న సర్వే సత్యనారాయణ. ధర్మపురిలో మహాకూటమి అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా కన్నం ఆంజయ్య, బిఎల్ఎఫ్ అభ్యర్థిగా మద్దెల రవీందర్, న్యూ ఇండియా తరుపున నరేష్ నామినేషన్ దాఖలు.
  •  ఈ రోజు కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పద్మావతి వారి వారి నియోజకర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మరిన్ని వార్తలు