ఔను ఓడిపోయాం.. కారణం అదే: ఒప్పుకున్న సీఎం!

18 Dec, 2017 15:58 IST|Sakshi

షిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని ఆయన వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రచారం చేయకపోవడం కూడా తమ ఓటమికి కారణాల్లో ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. కానీ మేం ఎన్నికల్లో వెనుకబడిపోయాం. ఓటమిని నేను అంగీకరిస్తున్నా.. ఇది ప్రజాతీర్పు. కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటి’  అని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.

68 స్థానాలు ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. కమల దళం ఇక్కడ 44 స్థానాలు (గెలుపు, ముందంజ) దక్కించుకోనుండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ 20 స్థానాలకు పరిమితం కానుందని తాజా ఫలితాల ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు