‘మాణిక్‌.. వెళ్లి ఎక్కడైనా తలదాచుకో!’

3 Mar, 2018 14:58 IST|Sakshi
మాణిక్‌ సర్కార్‌ (పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో బీజేపీ కూటమి ఘన విజయం దిశగా అడుగులు వేస్తుండటంతో.. ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌పై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు పేల్చటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాణిక్‌ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవటం ఉత్తమమంటూ బీజేపీ నేత హిమంత బిస్వా ఎద్దేవా చేశారు. 

శనివారం అగర్తలలో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో బిస్వా పాల్గొన్నారు. ‘ మాణిక్‌ సర్కార్‌ కావాలంటే ఆశ్రయం కోసం పశ్చిమ బెంగాల్‌, కేరళ, చివరకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ కైనా వెళ్లొచ్చు. ప్రస్తుతం ఆయన ముందు ఈ మూడు ఆఫ్షన్లు మాత్రమే ఉన్నాయి. ఎంచుకునే అవకాశం కూడా ఆయనకే ఇస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన ఎన్నికల తర్వాత మాణిక్‌ను బంగ్లాదేశ్‌కు సాగనంపుతానంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

సుమారు పాతికేళ్ల అధికారంలో కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. త్రిపుర ప్రజలు బీజేపీ-ఐపీఎఫ్‌టీకి పట్టం కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు