చంద్రబాబు తానే సీఎం అనుకుంటున్నారు : సుచరిత

2 Jul, 2019 16:18 IST|Sakshi

చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు

ఆయనకు జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉంది

ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదు

స్పష్టం చేసిన హోం మంత్రి సుచరిత

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రత తగ్గించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి చంద్రబాబు తానే సీఎం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 58 మంది ఇవ్వాల్సి చోట 74 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

చంద్రబాబుకు చెందిన ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించడం కుదరదని తెలిపారు.  అక్రమ కట్టడాల కూల్చివేతల అంశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని సూచించారు. గతంలో ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతలను తనిఖీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో గొడవలు జరిగాయన్నారు. గుంటూరు జిల్లాలో తండ్రీకొడుకులు ఆస్తి తగాదాల్లో మరణిస్తే.. దాని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగలేదని స్పష్టం చేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే కల్పిస్తామన్నారు. 

>
మరిన్ని వార్తలు