రాజకీయ లబ్ధి కోసం టీడీపీ చలోఆత్మకూరు : మంత్రి సుచరిత

11 Sep, 2019 15:46 IST|Sakshi

సాక్షి, కాకినాడ : రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ చలో ఆత్మకూరు కార్యక్రమం చేపడుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్నాడులో అరాచకమైన పాలన సాగిందని విమర్శించారు. బుధవారం ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పల్నాడు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ అందరు ప్రశాంతంగా ఉన్నా.. ఏదో జరిగిందని క్రియేట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. ‘గత ప్రభుత్వం ఏడు రాజకీయ హత్యలు జరిగితే అందులో ఆరు పల్నాడులోనే జరిగాయి. అక్రమ మైనింగ్‌ జరిందని ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదుదారులపైనే కేసులు పెట్టి హింసించారు. కే టాక్స్‌ పేరుతో కోడెల అతని బిడ్డలు ప్రజలను దోచుకుతిన్నారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టి బెదిరించారు. అవన్నీ మరుగున పడవేయడానికేన టీడీపీ నేతలు చలో ఆత్మకూరు పేరుతో నాటకాలు ఆడుతున్నారు. పల్నాడులో నిజమైన బాధితులు ఉంటే పోలీసులపై వారి ఇళ్లకు తీసుకువెళ్తారు. అంతే కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’  అని మంత్రి సుచరిత హెచ్చరించారు.

మరిన్ని వార్తలు