కాబోయే సీఎం సతీమణి.. బెంగళూరు వనితే

26 Dec, 2017 07:02 IST|Sakshi
పిల్లలతో జైరామ్‌ ఠాకూర్, సాధనా రావ్‌ దంపతులు

హిమాచల్‌ ప్రదేశ్‌ కోడలు సాధనా రావ్‌

సాక్షి, బెంగళూరు: హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నేత, కాబోయే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌కు కర్ణాటకతో అనుబంధం ఉంది. ఆయన సతీమణి డాక్టర్‌ సాధనా రావ్‌ కర్ణాటకకు చెందిన వారు. ప్రస్తుతం వీరి కుటుంబం సిమ్లాలో నివాసం ఉంటోంది. వివరాలు.... బెంగళూరుకు చెందిన డాక్టర్‌ సాధనా రావ్‌ జైపూర్‌లో ఎంబీబీఎస్‌ చదివే సందర్భంలో ఆమె ఏబీవీపీలో చురుకైన కార్యకర్త. ఇదే సందర్భంలో జమ్మూ– కాశ్మీర్‌ ఏబీవీపీ విభాగంలో కార్యకర్తగా ఉన్న జైరామ్‌ ఠాకూర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. వివాహం అనంతరం జైరామ్‌ ఠాకూర్‌ రాజకీయాల్లో నిమగ్నం కాగా, సాధనారావ్‌ తన వైద్య వృత్తిని కొనసాగించారు. ప్రస్తుతం ఆమె  సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.

త్వరలోనే బెంగళూరు వస్తాను: సాధన
కాగా, కర్ణాటక అన్నా ముఖ్యంగా బెంగళూరు అన్నా తనకెంతో గౌరవం, అభిమానం ఉన్నాయని డాక్టర్‌ సాధనా రావ్‌ చెబుతున్నారు. తనకు అవకాశం లభిస్తే త్వరలోనే బెంగళూరు వస్తానని చెప్పారు. ‘మా తాతగారు బెంగళూరులోనే ఉండేవారు. తండ్రి జైపూర్‌లో ఉండడంతో నా విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తాతగారు బెంగళూరులో ఉండడం వల్ల సెలవుల్లో అక్కడికే వచ్చేవాళ్లం. ప్రస్తుతం బెంగళూరు చాలా మారిపోయిందని, అభివృద్ధి చెందిందని స్నేహితుల ద్వారా విన్నాను. త్వరలోనే బెంగళూరు వస్తాను’ అని డాక్టర్‌ సాధన తెలిపారు.

మరిన్ని వార్తలు