కంచుకోటలకు బీటలు

24 May, 2019 03:42 IST|Sakshi

టీడీపీ స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ పాగా.. సంప్రదాయ ఓటుకు చిల్లు

పలు స్థానాల్లో 35 ఏళ్ల తర్వాత మొదటిసారి దేశం ఓటమి

అనేక దశాబ్దాలుగా గెలుస్తూ తమ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లోనూ ఈసారి తెలుగు దేశం ఘోరంగా ఓడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో టీడీపీకి 47 వరకు స్థానాల్లో గట్టి పట్టుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు వీటిలో గెలుపొందింది. ఇలాంటి పలు స్థానాలు ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఖాతాలో చేరిపోయాయి. మిగతా వాటిలోనూ తీవ్ర పోటీ ఎదురైంది. చంద్రబాబు కుప్పంలో ఎప్పుడూ 50 వేల పైగా ఓట్లతో గెలుస్తుండగా ఇప్పుడది 30 వేల లోపునకు పడిపోయింది. హిందూపురంలో ఆయన బావ మరిది, సినీ హీరో బాలకృష్ణకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండూ కాక ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 వరకు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల ఈసారి ఆ పార్టీ మట్టికరిచింది. 

సాక్షి, అమరావతి: 
- శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం (మొత్తం ఏడుసార్లు) సాధించింది. ఇప్పుడు మాత్రం టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఓడించారు. విజయనగరం జిల్లా నెలిమర్ల (ఏడుసార్లు నెగ్గింది)లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బి.అప్పలనాయుడు... టీడీపీ అభ్యర్థి నారాయణను పరాజయం పాల్జేశారు. 
- 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు (టీడీపీ)... వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడారు. ఇదే జిల్లా శృంగవరపు కోటలోనూ టీడీపీ ఏడుసార్లు గెలిచింది. తాజాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కె.శ్రీనివాస్‌... కోళ్ల లలిత కుమారి (టీడీపీ)ని ఓడించారు.  
​​​​​​​- పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నెగ్గింది.  
​​​​​​​- ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత (టీడీపీ)... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తానేటి వనిత చేతిలో పరాయం పాలయ్యారు. ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ... వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీరంగనాథ రాజు చేతిలో ఓడారు. టీడీపీ ఏడుసార్లు నెగ్గిన నర్సాపురం, గోపాలపురంలలోనూ వైఎస్సార్‌సీపీ పాగా వేసింది.  
​​​​​​​- ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామను వైసీపీ హవాలో టీడీపీ చేజార్చుకుంది. 
​​​​​​​-1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... ఇప్పుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. 
​​​​​​​- అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ సీనియర్‌ నేత బీకే పార్థసారథి... వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చేతిలో ఎం.శంకరనారాయణ చేతిలో ఓడారు. 
​​​​​​​- చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 
​​​​​​​- కర్నూలు జిల్లా పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబును దించగా వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతిలో ఓడారు. 

హేమాహేమీలకు పరాభవం 
1983 నుంచి ఆరుసార్లు నెగ్గిన 29 నియోజకవర్గాల్లో చాలావరకు టీడీపీ చేజారాయి. ఆ జాబితా చూస్తే... 
​​​​​​​- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకటరావు ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా)లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌పై ఓడారు. 
​​​​​​​- విశాఖ జిల్లా భీమిలి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి వైస్సార్‌సీపీ హస్తగతమయ్యాయి. నర్సీపట్నంలో టీడీపీ సీనియర్‌ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉమాశంకర్‌ గణేశ్‌ చేతిలో ఓడారు. 
​​​​​​​- రంపచోడవరం, తుని, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరుల్లోనూ సైకిల్‌ పంక్చరైంది. 
​​​​​​​- రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనాలకు నెలవైన దెందులూరు (పశ్చిమగోదావరి)లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఓటర్లు తిరస్కరించారు. చింతలపూడిలోనూ వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది.  
​​​​​​​- కృష్ణా జిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ చేతిలో పరాజయం చవిచూశారు. అవనిగడ్డలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌... వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌ చేతిలో ఓడిపోయారు.  
​​​​​​​- గుంటూరు జిల్లా వినుకొండ, ప్రత్తిపాడు, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.  

మరిన్ని వార్తలు