సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

7 Aug, 2019 18:00 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నాయకురాలు, విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు యావత్‌ దేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. తీవ్ర గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. నిండైన భారతీయ రూపంతో, తన వాక్పటిమతో ప్రజలను ప్రేమగా హత్తుకొనే నాయకత్వ శైలితో ప్రజలకు ఎంతో చేరువన ఈ చిన్నమ్మకు కన్నీటి నివాళులర్పించేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆమె నివాసంలో, అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుష్మా భౌతికకాయానికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు నివాళులర్పించారు. ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రకు తరలించే ముందు.. ఆమె తనయురాలు బాన్సూరి స్వరాజ్‌, భర్త స్వరాజ్‌ కౌశల్‌ తుదిసారి సెల్యూట్‌ చెప్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం లోధీ రోడ్డులోని శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో సుష్మా స్వరాజ్‌ అంత్యక్రియలు జరిగాయి. ఆమె పార్థివ దేహానికి వద్ద భద్రతా బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కుమార్తె బాన్సూరీ స్వరాజ్‌ చేతుల మీదుగా ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

మరిన్ని వార్తలు