హుజూర్‌నగర్‌ సభ : సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

26 Oct, 2019 18:01 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
(చదవండి : కారుకే జై హుజూర్‌!)

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్‌ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు