తొలి ఎమ్మెల్యేలు..మహామహులు!

23 Oct, 2018 10:44 IST|Sakshi
హైదరాబాద్‌ స్టేట్‌ తొలి కేబినెట్‌ సభ్యులు బూర్గుల, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తదితరులు

తొలి కేబినెట్‌లో ఉస్మాన్‌ అలీఖాన్, బూర్గుల

జీఎస్‌ మెల్కోటే, ఎగ్బోటే, మెహిదీ నవాజ్‌ జంగ్‌ సైతం

వీబీ రాజు చేతిలో జయసూర్య నాయుడు ఓటమి

శాలిబండ నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా మాసుమా

అసెంబ్లీ ఎన్నికల గత చరిత్రను తిరగేస్తే ఎన్నో..ఎన్నెన్నో విశేషాలు వెలుగుచూస్తాయి. 1952లో హైదరాబాద్‌ స్టేట్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే మన శాసనసభ..శాసనసభ్యుల తీరుతెన్నులు తెలుస్తాయి. నియోజకవర్గాల్లో మార్పులు గోచరిస్తాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఎన్నికలు, అసెంబ్లీ, నియోజకవర్గాలు తదితర విశేషాలు నేటి నుంచి ‘హైదరాబాద్‌ ఫ్లాష్‌బ్యాక్‌’ పేరిట మీ కోసం...

సాక్షి, సిటీబ్యూరో: తొలి శాసనసభలో నగరం నుంచి డాక్టర్లు, న్యాయవాదులు, ఉన్నత విద్యావంతులే సభ్యులుగా ఎన్నికయ్యారు. కర్ణాటక, మహారాష్ట్రలతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన అనంతరం హైదరాబాద్‌ స్టేట్‌కు 1952లో తొలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో  నగరంలోని మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోగా ఎన్నికైన వారితో పాటు పోటీకి దిగిన వారంతా ఉన్నత విద్యావంతులే కావటం విశేషం. 1952లో ఇక్కడ మొత్తం పదకొండు శాసనసభ స్థానాలుండగా అందులో సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలనుండి ఇద్దరేసి సభ్యులను(ద్విసభ) ఎన్నుకున్నారు. ఇందులో మలక్‌పేట, ఇబ్రహీంప్నటం స్థానాల్లో సీపీఐ ఆధ్వర్యంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ విజయం సాధిస్తే, హైదరాబాద్‌ సిటీ నియోజకవర్గం నుండి స్వతంత్య్ర అభ్యర్థి గెలిచారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

విద్యావంతులే అంతా
హైదరాబాద్‌ స్టేట్‌లో నెంబర్‌ వన్‌ స్థానమైన ముషీరాబాద్‌ నుండి డాక్టర్‌ జీఎస్‌ మెల్కొటే 57.73 శాతం ఓట్లతో విజయం సాధించారు. మెల్కోటే 1927 సైన్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆపై డాక్టర్‌గా విశేష సేవలందించారు. మెల్కోటే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. తొలి ప్రభుత్వంలోనే ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చాదర్‌ఘాట్‌ నుండి జస్టిస్‌ గోపాలరావు ఎగ్బోటే 62.86 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఎగ్బోటే సైతం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పదవీ విరమణ చేశాక ఆయన ఏపీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా కూడా సేవలందించారు. బేగంబజార్‌ నుండి విజయం సాధించిన కాశీనాథ్‌ వైద్య 72.86 శాతం ఓట్లతో విజయం సాధించి తొలి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాశీనాథ్‌ సైతం ఉన్న విద్యావంతుడే.

తొలిసభలోనే మహిళా ప్రాతినిథ్యం
తొలి శాసనసభలోనే నగరం నుండి మహిళా ఎమ్మెల్యేగా మాసుమాబేగం విజయం సాధించారు. శాలిబండ నియోకజవర్గం నుంచి ఆమె 47.09 శాతం ఓట్లతో ప్రముఖ కవి, పీడీఎఫ్‌ అభ్యర్థి ముగ్దూం మోహినొద్దీన్‌ను ఓడించారు. ఇదే ఎన్నికల్లో సోమాజిగూడ స్థానం నుంచి పోటీ చేసిన మెహిదీ నవాజ్‌ జంగ్‌ 54.30 శాతం ఓట్లతో విజయం సాధించారు. నవాజ్‌ జంగ్‌ నిజాంకు అతి సన్నిహితునిగా, నిజాం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సెల్‌ సెక్రటరీగా పనిచేశారు. అంతకు ముందు నగర మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా జంగ్‌ పనిచేశారు. ఇక హైదరాబాద్‌ సిటీ నుండి సయ్యద్‌ హసన్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించగా, కార్వాన్‌ నుండి నరేంద్ర, సికింద్రాబాద్‌ (ద్విసభ) నుండి జేబీ ముత్యాలరావు, వీబీరాజు, ఇబ్రహీపట్నం(ద్విసభ)లో ఎంబీ గౌతమ్, మేడ్చల్‌ నుండి వరకాంతం గోపాల్‌రెడ్డిలు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా విజయం సాధిస్తే, మలక్‌ పేట నుంచి అబ్దుల్‌ రహమాన్, ఇబ్రహీంపట్నంలోని మరోస్థానంలో పాపిరెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్‌ ద్విసభ స్థానంలో పీడీఎఫ్‌ నుండి పోటీ చేసిన సరో జిని నాయుడు కుమారుడు డాక్టర్‌ జయసూర్య నాయుడు వీబీరాజు చేతిలో ఓటమిపాలయ్యారు.

మరిన్ని వార్తలు