మా నాన్నకు ప్రాణహాని ఉంది!

24 Mar, 2018 16:19 IST|Sakshi
తండ్రి లాలూతో తేజస్వి (ఫైల్‌ఫొటో)

రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ను దాణా కుంభకోణం వెంటాడుతోంది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయనను దోషిగా తేల్చిన రాంచీ కోర్టు..  శనివారం లాలూకు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. దాణా స్కాంలో లాలూకు వరుసగా జైలుశిక్షలు పడుతున్న నేపథ్యంలో ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ స్పందించారు. ‘మా నాన్నకు ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పుందని భయం కలుగుతోంది’ అని ఆయన శనివారం విలేకరులతో పేర్కొన్నారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర చేసినట్టు కనిపిస్తోందని తెలిపారు.

‘బీజేపీ, (బిహార్‌) సీఎం నితీశ్‌కుమార్‌ లాలూను చూసి భయపడుతున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావొద్దని కోరుకుంటున్నారు. లాలూ జైలు నుంచి వస్తే.. రెండోసారి ప్రధానమంత్రి కావాలన్న నరేంద్రమోదీ కల నెరవేరదన్న విషయం వారికి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు’ అని తేజస్వి పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బిహార్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ కొట్టిపారేశారు. జైలులో లాలూను ఎవరు కలువలేరు. అలాంటప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు