ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏడాది క్రితమే చెప్పా!

10 Sep, 2018 15:09 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని, ఈ యుద్ధానికి తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం నడిపే అనుభవం తమకు ఉందన్నారు.

సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ఆన్‌ రికార్డు చెప్పానని ఆమె పేర్కొన్నారు. పొత్తులపై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతున్నామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ప్రజలకు మేలు చేయడం లక్ష్యంగా పొత్తులు ఉంటాయని అన్నారు. టీడీపీ- కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఆ ప్రచారం నిజమయ్యేవరకు తాను కామెంట్‌ చేయనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం, ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం తదితర విషయాల్లో పార్టీ అధినాయకత్వం నిర్ణయం, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు.

మరిన్ని వార్తలు