పోటీకి సై అంటున్న లోకనాయకుడు

22 Dec, 2018 14:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీచేస్తుందని మక్కల్ నీధి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. రాజకీయ రంగులు మార్చే పార్టీలతో జట్టు కట్టమని, తమిళనాడు అభివృద్దే తమ లక్ష్యమని తెలిపారు. 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

పొత్తు నిర్ణయాలను పూర్తిగా కమల్‌కు ఇస్తూ మక్కల్‌ నీధి మయ్యం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నామని, తమతో కలిసి వచ్చే పక్షాలను స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా లోకనాయకుడిగా పేరొందిన కమల్‌ హాసన్‌ ఈఏడాది ఫిబ్రవరిలో సొంతపార్టీని ఏర్పాటు చేసి రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు