నేను పోటీ చేయను: కడియం శ్రీహరి

1 Oct, 2018 02:47 IST|Sakshi

హన్మకొండ: ఈ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదని, తాను కాంగ్రెస్‌ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరబోనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న వదంతులు, సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లను నమ్మొద్దని ఆయన అన్నారు. ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదన్నారు.

జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయనని చెప్పారు. ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్‌ ఉప ముఖ్యమంత్రిని చేశారని, కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లోనే పని చేస్తానని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన కూతురు పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వరంగల్‌ తూర్పులో గెలవలేకనే కొండా సురేఖ పరకాలకు పలాయనం చిత్తగించారని కడియం విమర్శించారు. దమ్ముంటే కొండా సురేఖ వరం గల్‌ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు.

మరిన్ని వార్తలు