'నా భార్య ప్లేస్‌లో బరిలో దిగుతా'

22 Jan, 2018 18:28 IST|Sakshi

సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ 2019 సాధారణ ఎన్నికల్లో తన భార్య స్థానంలో నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కనివ్వబోనని అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తీవ్ర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అఖిలేశ్‌ తన పార్టీని సంస్థాగతంగా మరోసారి బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల ఏ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోనని, అలా చేయడం సమయం వృధా అని కూడా ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనను కలిసిన కొందరు మీడియా మిత్రులు 2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించగా 'నేను ఈసారి కనౌజ్‌ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పారు. కనౌజ్‌లో ప్రస్తుతం అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిపై 20వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, 2017లో కనౌజ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సమాజ్‌వాది ఓటమిని చవిచూసింది.

మరిన్ని వార్తలు