వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిస్తే పని చేస్తా: జగ్గారెడ్డి

12 Jun, 2019 18:09 IST|Sakshi
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి పని చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. వచ్చే నెల జూలై 10 నుంచి సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిస్థాయి సమయం కేటాయిస్తానని అన్నారు. పార్టీ మారిన వాళ్ల గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీలోనే ఉండి సొరంగాలు(గోతులు) తవ్వే వాళ్లపై అధిష్టానం దృష్టి సారించాలని కోరారు. 

ఎప్పుడూ సంచనల వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తారేమో ఆయన అభిమానులు భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనను టీఆర్‌ఎస్‌లోకి రమ్మని ఎవరూ పిలవలేదని, తాను కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని ప్రయత్నించలేదని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. తన రాజకీయ అడుగులన్నీ సంగారెడ్డి ప్రజల కోసమేనని జగ్గారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు